ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. తుర్పు గోదావరిలో ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మరన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను జగన్ నెరవేర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా అమలయ్యాయని తెలిపారు. ఇందులో సీఎం జగన్ చేసింది ఏముందని ప్రశ్నించారు.
READ MORE:Posani Krishna Murali: రాజకీయాల్లో ఉన్నవాళ్లలో ఉత్తమమైన నేతలకే మద్దతు ఇస్తా..
రైతుల కోసం జిల్లాకి ఒక కోల్డ్ స్టోరేజ్, ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యాయని అడిగారు. పోలవరం పరిస్థితి ఏంటని.. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే మూడు కోట్లతో మరమ్మతులు చేయించలేకపోయారని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇప్పటికే జనసేనతో కలసి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రకటించిన అంశాలను కూడా ఏపీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని తెలిపారు. కాగా ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అటు కూటమి, ఇటు వైసీపీ అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. ఈ రోజు నవరత్నాల పేరుతో వైసీపీ తన మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది. కూటమి కూడా మేనిఫెస్టోను విడుదల చేసింది.