YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల!

Sharmila

Sharmila

YS Sharmila: ఏపీ కాంగ్రెస్‌లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన తరుణంలో ఆ స్థానంలో వైఎస్‌ షర్మిలను నియమించే అవకాశాలున్నాయని సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మణిపూర్‌లో పీసీసీ అధ్యక్ష పదవిపై వైఎస్‌ షర్మిలకు మల్లికార్జున ఖర్గే స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుండగా.. హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టుగా సమాచారం. గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించి షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Gidugu Rudraraju Resigns: పీసీసీ అధ్యక్ష పదవికి రుద్రరాజు రాజీనామా.. అందుకేనా..?

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రేస్‌లోకి తీసుకొచ్చేందుకు అధిష్ఠానం వ్యూహాలను రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చి ఆమెకు కాంగ్రెస్‌ కండువా కప్పారనే ప్రచారం సాగింది.. ఇప్పటి వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజు రాజీనామ చేయడంతో.. త్వరలోనే వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపడతారనే ప్రచారం సాగుతోంది. అయితే, తన కుమారుడి పెళ్లి ఏర్పాట్లలో ప్రస్తుతం బిజీగా ఉన్న షర్మిల.. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను కలుస్తూ.. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానిస్తున్న విషయం విదితమే.