Congress Disciplinary Action: తెలంగాణ కాంగ్రెస్లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డిపై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఇద్దరు నేతల వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం కూడా ఇప్పటికే పరిశీలన జరిపి, ఇరువురు నేతలపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉండబోతుందనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీలో క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదనే వైఖరితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా గట్టిగా సమర్థిస్తున్నట్లు సమాచారం. ఇరువురు నేతల వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి తన అభిప్రాయాలను స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తే పార్టీకి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్లోని కొందరు కీలక నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తప్పకపోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. అధిష్ఠానం నుంచి నిర్ణయం వెలువడిన అనంతరం రాష్ట్ర కాంగ్రెస్లో తదుపరి పరిణామాలు వేగంగా చోటుచేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
క్రమశిక్షణా చర్యలపై అధిష్ఠానం నిర్ణయం అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా కొనసాగుతోంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త టీమ్తో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రివర్గంలో మార్పులు, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు పార్టీలో క్రమశిక్షణ అంశంపై తీసుకునే నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఈ పరిణామాలు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, అంచనాలుగానే పరిగణించాల్సి ఉంటుంది.

