Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. బీజేపీ అధ్యక్షుడు ఫైర్.!

Ramchander Rao

Ramchander Rao

Ramchander Rao: జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొని శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. అఖండ భారత సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ సేవలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, జాతీయత కోసం ఆయన చేసిన త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం డ్యాం భద్రతపై జాతీయ డ్యాం భద్రతా సంస్థ (NDSA) హెచ్చరికలు చేసినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికీ మరమ్మతులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకుని భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించిన రాంచందర్ రావు, ఆ అవినీతి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అవినీతిపై నామమాత్ర చర్యలతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.

మరోవైపు హైడ్రా చర్యలపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నారని, అయితే ఎంఐఎంకు చెందిన అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫాతిమా విద్యాసంస్థలలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులే కోర్టుకు తెలిపారని, హైకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

ఆక్రమణలు జరిగినట్లు అంగీకరించినప్పటికీ అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడం వెనుక కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ కారణమని రాంచందర్ రావు ఆరోపించారు. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేసి అందరికీ ఒకే విధమైన న్యాయం చేయాలని, హైకోర్టు ఆదేశాల మేరకు ఎంఐఎంకు చెందిన అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్, ఎంఐఎం, హైడ్రా వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాపోరాటం చేపడుతుందని రాంచందర్ రావు అన్నారు.