NTV Telugu Site icon

CM YS Jagan: పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు.. సీఎం ఆదేశాలు

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఇందులో నమోదు చేయాలని స్పష్టం చేశారు.. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్‌ నంబర్‌ ప్రతిచోటా ఉంచాలన్న ఆయన.. అలాగే సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలన్నారు.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి.. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్‌ల పనితీరు ఇందులో కీలకం.. ప్రివెంటివ్‌ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం అన్నారు.. వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం.. ఒక ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని.. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదన్నారు.. 4 వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌కి రెడీ అవుతున్న హక్కుల సంఘాలు..

ఇక, అక్టోబర్‌ 22న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించినట్టు వివరించారు సీఎం జగన్.. పేషెంట్‌కు చికిత్స అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలన్నారు. విలేజ్‌ క్లినిక్‌ స్ధాయిలో కంటి పరీక్షలు కూడా చేయాలి.. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు జరగాలన్నారు.. మరోవైపు.. సికిల్‌ సెల్‌ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.. ఈ ఏడాది 6.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు అధికారులు. ఈ నెలలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.. ఓరల్‌ హెల్త్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలియజేశారు.. ఈ సమయంలో దంత సమస్యల చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..

Read Also: Siddipet: సిద్దిపేట జిల్లాలో అమానుషం.. అప్పుడే పుట్టిన శిశు విక్రయం కలకలం..!

మరోవైపు.. ఈ విద్యా సంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌.. మెడికల్‌ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. ఇక, పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని.. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా వివరించారు అధికారులు.