CM YS Jagan: సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు మూడో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఈ రోజు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీ.. ఎనిమిది మృతి
ఇక, ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఈ ఐదేళ్లలో YCP ఏం చేసిందో చెబుతూనే, కూటమిపై పంచ్లు, సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు, ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు జగన్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రచారం చేశారు సీఎం జగన్. రాబోయే ఐదేళ్లు అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన సభలో కూటమిపై పార్టీల తీరును తూర్పారబట్టారు జగన్. వాళ్లకు దోచుకోవడం, పంచుకోవడమే మాత్రమే తెలుసన్నారు. చంద్రబాబు మార్క్ దోపిడి సామ్రాజ్యం మళ్లీ రావొద్దంటే వైసీపీని గెలిపించాలని కోరారు జగన్.