కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని కోరారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా.. సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావల్సిన వాటా మొత్తాన్ని 2023 అక్టోబరు నుంచి తామే విడుదల చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Read Also: Niranjan Reddy: రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మమ్మల్ని జనం అడుగుతున్నారు..
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. సోమవారం కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. రాష్ట్రంలో తాము నిర్మించదల్చిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షలు ఇళ్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్సీ) పద్ధతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.
Read Also: Stock market: మరోసారి రికార్డ్లు సృష్టించిన స్టాక్ మార్కెట్