HYDRAA Police Station: హైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన సీఎంకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ IPS స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్తో కలిసి పోలీస్ స్టేషన్లోని వసతులను పరిశీలించారు. ఇక హైడ్రా కార్యకలాపాల కోసం కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 55 స్కార్పియోలు, 21 ట్రక్కులు, 4 ఇన్నోవాలు, అనేక ద్విచక్ర వాహనాలు సేవలోకి తెచ్చారు. ఇవన్నీ హైడ్రా పరిధిలో పటిష్ఠ భద్రత, సమర్థవంతమైన పనులకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
Read Also: Operation Sindoor: ఏడవడం ఒక్కటే తక్కువ.. పాకిస్తాన్ పార్లమెంటులో ఎమోషనలైన ఎంపీ.. వీడియో వైరల్!
ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ IPS మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నర నెలలుగా హైడ్రా ప్రజలకు ఎంతో చేరువైన సంస్థగా మారిందని.. ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల పవర్లను ఒకేచోట సమన్వయం చేయడంలో హైడ్రా స్టేషన్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అలాగే, సీఎం ఏ ఉద్దేశంతో హైడ్రా వ్యవస్థను ప్రారంభించారో.. అదే దిశగా హైడ్రా విధుల్లో నిబద్ధత చూపుతోందని చెప్పారు. హైడ్రా వ్యవస్థ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ, ఆస్తి రక్షణ మాత్రమే కాకుండా డిజాస్టర్ రెస్పాండ్స్ కూడా సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా పెద్ద ఎత్తులో వాడుతూ FTL పరిధి గుర్తిస్తున్నామని, హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ల్యాండ్ గ్రేబింగ్, చీటింగ్, ఫోర్జరీ చేసేవారి పై చర్యలు తీసుకోవడానికి అవకాశం దక్కిందని, ప్రజల ఆకాంక్ష మేరకు హైడ్రా ఇలాగే ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.