NTV Telugu Site icon

CM Revanth Reddy : 6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి.. తక్కువ ఖర్చు.. రైతులకు మేలు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి.. అసంపూర్తిగా ఉన్నవి.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అటు గోదావరి బేసిన్ తో పాటు ఇటు కృష్ణా బేసిన్ లో అర్థాంతరంగా ఆగిపోయిన ​ ప్రాజెక్టుల వివరాలన్నీ ఇరిగేషన్​ ఇంజనీర్ల నుంచి ఆరా తీశారు. రైతులకు సాగునీటిని అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వం పదేండ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయి. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించటం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే వదిలేసింది. అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఇందులో భాగంగా గోదావరి బేసిన్ లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని, దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇరిగేషన్ విభాగం అంచనాలు రూపొందించింది. తక్కువ నిధులతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల పనులను వీలైనంత తొందరగా పూర్తి చేపట్టాలని, వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు వీలుగా నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగు తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది.