NTV Telugu Site icon

CM Revanth Reddy : వరంగల్‌ పర్యటనలో అధికారులపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు సీఎం రేవంత్‌. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని రేవంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమెంటని ఆయన మండిపడ్డారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అయితే.. ఇదిలా ఉంటే.. వరంగల్ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్న సీఎం.. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని, వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని, నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. వరంగల్ లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌ రెడ్డి.