CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్‌లైన్.!

  • 1500 ఎకరాల్లో భారీ డేటా సిటీ ఏర్పాటు దిశగా తెలంగాణ
  • బుల్లెట్ ట్రైన్ భూ సేకరణ పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్
  • టీ-ఫైబర్‌కు మూడు నెలల డెడ్‌లైన్ విధించిన సీఎం
  • టైర్-2 నగరాల్లో GCCలు, డేటా సెంటర్లపై ప్రత్యేక ఫోకస్
Cm Revanth

Cm Revanth

తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ , డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ లో జరిగిన పరిశ్రమలు, ఐటీ శాఖల రివ్యూ మీటింగ్‌లో రాష్ట్రంలో డిజిటల్ నెట్‌వర్క్, ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఏకంగా 1500 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఒక సరికొత్త ‘డేటా సిటీ’ (Data City) ని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం అనౌన్స్ చేశారు.

ఈ ప్రతిష్టాత్మక డేటా సిటీ నిర్వహణకు భారీగా నీటి అవసరాలు ఉంటాయని, అందుకోసం ప్యూర్ వాటర్ కాకుండా ఎస్ టీ పీ (STP – Sewage Treatment Plant) ల ద్వారా రీసైకిల్ చేసిన నీటిని వినియోగించేలా ప్లాన్ చేయాలని అధికారులకు సీఎం గైడెన్స్ ఇచ్చారు. అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs), పెద్ద పెద్ద డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలలో (Tier-2 Cities) కూడా ఈ జీసీసీల ఏర్పాటుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేలా సరికొత్త ఐటీ అండ్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావాలన్నారు.

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాబోయే బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) పనులను తక్షణమే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ అయిన టీ-ఫైబర్ (T-Fiber) పై సీఎం రేవంత్ రెడ్డి కఠిన డెడ్‌లైన్ విధించారు. రాబోయే మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు (Government Offices) తప్పనిసరిగా టీ-ఫైబర్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ను కూడా మన ఫ్యూచర్ సిటీకే వచ్చేలా చూడాలని, అవసరమైతే దీని కోసం తాను స్వయంగా ప్రధాని మోడీని కలిసి రిక్వెస్ట్ చేస్తానని సీఎం అధికారులతో పేర్కొన్నారు.