NTV Telugu Site icon

CM Chandrababu: దగ్గుబాటి పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదు!

Cm Chandrababu

Cm Chandrababu

మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి వచ్చారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.

‘దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదు. 40 ఏళ్లు కలిసి ఉన్నాం కానీ.. ఆయన పుస్తకం రాయడం ఏంటని నాకు డౌట్ వచ్చింది. దగ్గుబాటి మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి. దగ్గుబాటి ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారు. వేంకటేశ్వర రావు రైటర్ కాని రైటర్. ఆయన డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయలేదు. మంత్రిగా ఉండి ప్రాక్టీస్ చేశారు.. సినిమాలు తీశారు. యాక్తివ్ లైఫ్ నుంచి రిటైర్డ్ లైఫ్ కు వచ్చారు కదా.. ఎలా కాలక్షేపం అని అడిగాను. నాకూ అటువంటి పరిస్థితి రావచ్చని అడిగాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

వేంకటేశ్వర రావు రోజు వారీ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు పేకాట ప్రస్తావన తెచ్చారు. ఇక పురంధేశ్వరి ఎన్నికలను నడిపించిన తీరు అభినందనీయం అని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో తోడల్లుళ్లు వెంకటేశ్వర రావు, చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 1978లో వెంకయ్య నాయుడు, తాను తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టామని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనలో పంచ్‌లు తగ్గలేదు సరికదా ఇప్పుడు పెరిగాయని సీఎం చెప్పుకొచ్చారు.