CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..

Cm Chandrababu Speech

Cm Chandrababu Speech

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా #NijamGelichindi (నిజం గెలిచింది) అనే హాష్‌ట్యాగ్‌తో భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. గతంలో తాను ఎదుర్కొన్న అక్రమ అరెస్టు, జైలు జీవితం, ఆ సమయంలో ప్రజలు చూపించిన మద్దతును స్మరించుకుంటూ ఆయన ఈ ప్రకటన చేశారు.

చంద్రబాబు తన సందేశంలో, ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారని, నిజం కోసం పోరాడితే ఆ నిజమే మనల్ని నిలబెడుతుందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం రాజకీయ కుట్రలో భాగంగా తనను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో బంధించారని గుర్తుచేసుకున్నారు. ఎంత కాలం జైలులో ఉంచినప్పటికీ, తన మనోధైర్యాన్ని, స్ఫూర్తిని దెబ్బతీయడం ఎవరి వల్ల కాలేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థులు సాగించిన రాక్షస చర్యలకు తాను ఎప్పుడూ కుంగిపోలేదని, లొంగిపోలేదని వివరించారు.

ఆ క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోరాడారని చంద్రబాబు కొనియాడారు. నాడు ప్రజలు చూపిన అపారమైన సంఘీభావం, ధైర్యం , తెగువ తన జీవితంలో ఎప్పటికీ చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెప్పారు. చివరకు న్యాయమే గెలిచిందని, ప్రజల ఆశీస్సులతోనే మళ్లీ ప్రజాసేవలో నిలబడ్డానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.