అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న ప్రజా చైతన్య కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారంపై ఆయన నేతలకు కీలక సూచనలు చేశారు. రేపటి నుంచి 45 రోజుల పాటు టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి ప్రజలకు వివరించాలని సీఎం నేతలకు సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్తో పాటు 57 శాతం ఓట్లను సాధించగలిగింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసకర పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగానే ఒకప్పుడు 151 సీట్లు గెలిచిన పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. టీడీపీతో పాటు కూటమి పార్టీల సమిష్టి పోరాటం, సరైన వ్యూహాలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని అధికారంలోకి వచ్చాము. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా పాలన అందిస్తోంది. ప్రతి నిర్ణయంలో ప్రజాభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలవడమే లక్ష్యంగా పనిచేయాలి. టీడీపీతో పాటు కూటమి పార్టీల అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలి. బూత్ కన్వీనర్ల నుంచి అన్ని స్థాయి నాయకులు ప్రజలతో సన్నిహితంగా ఉంటూ కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేయాలి’ అని సూచించారు.
‘నాకు అనుచరులు అవసరం లేదు.. పార్టీకి నాయకులు కావాలి’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘సమస్యలకు పరిష్కారాలు చూపగలిగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ప్రతి నాయకుడు తనలో లీడర్షిప్ క్వాలిటీలను అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల సమయంలో ఇంటింటికీ వెళ్లి హామీలు వివరించినట్లే, ఇప్పుడు కూడా ప్రభుత్వం వాటిని ఎలా అమలు చేస్తోందో ప్రజలకు వివరించాలి. ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని ఓర్పుతో నివృత్తి చేయాలి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ యంత్రాంగం మొత్తం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలి. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమే, అయితే ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వకూడదు’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
‘ప్రజలకు నచ్చని పనులు చేయకుండా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కొనసాగడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాలి. యువత సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గత ప్రభుత్వం యువత భవిష్యత్తును ఎలా దెబ్బతీసిందో కూడా వివరించాలి. యువత ఆలోచనలు, భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. కేవలం డబ్బులతో ప్రజల మద్దతు పొందలేము, ప్రజల విశ్వాసమే రాజకీయాల్లో అసలైన బలం’ అని సీఎం చెప్పారు.
2024 ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా పార్టీ నాయకులు గమనించాలని సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రతిపక్ష పార్టీ అనుసరిస్తున్న విధానాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజల ముందు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమైతే ప్రతిపక్షాల కుట్రలను సమర్థంగా తిప్పికొట్టవచ్చని, ప్రతి నాయకుడు ప్రజల్లో ఉండడాన్ని తన బాధ్యతగా భావించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

