Maharashtra: శివసేన వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్‌

Shivsena

Shivsena

Maharashtra: మహారాష్ట్రలోని థానేలో సోమవారం అర్థరాత్రి శివసేనకు చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే సేన వర్గానికి చెందిన కొత్తగా నియమితులైన ఆఫీస్ బేరర్లను సత్కరించే కార్యక్రమం కిసాన్ నగర్‌లో జరిగింది. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపేందుకు ఎంపీ రాజన్ విచారే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన కొందరు సేన కార్యకర్తలు ఉద్ధవ్‌ వర్గానికి చెందిన సభ్యులను దూషించారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తల నినాదాలు హోరాహోరీగా సాగాయి. ఘర్షణ ముదిరి దాడి చేసుకునే వరకు వచ్చింది. ఇరు వర్గాలు దాడికి దిగగా.. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇరువర్గాల మద్దతుదారులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేందుకు థానేలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.