CJI Surya Kant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నిరసనలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల్లో పాల్గొంటున్న యువ విద్యార్థి నిరసనకారుల పట్ల అధికారులు సంయమనం పాటించాలని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. హింసను అదుపు చేయడానికి పోలీసు బలగాలు కూడా తీవ్రమైన ప్రతిస్పందనలు ఇస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సీజేపీ నిర్వహించిన నిరసనల్లో యువకులు తీవ్ర అలజడి సృష్టించారని, రాళ్లదాడి, హింసకు పాల్పడ్డారని, జరిగిన నష్టానికి ఆ సంస్థనే బాధ్యులను చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారిస్తూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ను ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో విద్యార్థి ఆందోళనలపై దాఖలైన మిగిలిన పిటిషన్లతో సుప్రీంకోర్టు జతచేసింది.
ప్రజాస్వామ్యంలో శాంతియుత ప్రదర్శనల సమయంలో భద్రతా దళాలు సహనంతో ఉండాలని, యువత హింస వైపు మళ్లకుండా అధికారులు చూసుకోవాలని సీజేఐ పేర్కొన్నారు. యువత ఏం చెప్తున్నారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారో ఓపికగా వినడమే అన్నింటికంటే శక్తివంతమైన పరిష్కారమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, పరిస్థితులను చక్కదిద్దే విషయంలో శాంతిభద్రతల సంస్థల విచక్షణపై కోర్టు విశ్వాసం వ్యక్తం చేసింది. ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అధికారులకు బాగా తెలుసని, కేంద్ర ప్రభుత్వం, సంబంధిత వర్గాల వైఖరిని పరిశీలించిన తర్వాత తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలు బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు పాకి ఉద్రిక్తతలకు దారితీశాయి. జులై 20న ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో రాళ్లదాడి, లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లు, పిస్టల్స్, పెల్లెట్ తుపాకుల వినియోగం వల్ల విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే యువత ఆవేదనను ఆలకించాలని సీజేఐ సూచించారు.

