ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాల్చల్ చేశారు. తన కుటుంబ సభ్యులపట్ల టీడీపీ నాయకుడు ఈడుపుగంటి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు శ్రీనివాస్ ఇంటిని ముట్టడించేందుకు చింతమనేని అనుచర వర్గం ప్రయత్నించింది. అయితే చింతమనేని పోలీసులు అడ్డుకోవడంతో అర్ధరాత్రి సమయంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. గతంలో శ్రీనివాస్ చింతమనేని తరపు న్యాయవాదిగా వ్యవహరించారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు పెరగడంతో దెందులూరు నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ అడ్వకేట్ శ్రీనివాస్ తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే చింతమనేనితో పాటు ఆయన తరపున మాట్లాడే వారిపై ఘాటుగా శ్రీనివాస్ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని చింతమనేని ఫిర్యాదు చేయడంతో పాటు అతని ఇంటికి చింతమనేని అనుచర వర్గం చేరుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. అరెస్టు చేయకుంటే అక్కడ నుంచి కదిలేది లేదని చింతమనేని తేల్చి చెప్పారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి టీడీపీ నేత శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలో ఆరోపణలు చేసిన టీడీపీ నేత, అడ్వకేట్ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. టీడీపీ పార్టీలో ఉంటూ వైసీపీ నేతలకు సహకరించడంతో పాటు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడంతో అతడిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఈడ్పుగంటి – చింతమనేని వ్యవహారం ఇప్పుడు టీడీపీలో దుమారాన్ని రేపుతుంది.

