Site icon NTV Telugu

China: ట్రంప్‌తో పాటు మా పాత్ర కూడా ఉంది.. భారత్-పాక్ వార్‌ విరమణపై చైనా కొత్త రాగం

China

China

తాము కూడా ‘‘శాంతికాముకులం’’ అంటూ డ్రాగన్ దేశం చైనా కూడా కొత్త రాగం అందుకుంది. ట్రంప్‌తో పాటు చైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు ఆపిందని.. శాంతి చర్చల్లో పాల్గొందంటూ కొత్త పలుకు పలికింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం మే 7న ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత మే 10న ఇరు దేశాల చర్చలతో కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ క్రెడిట్‌ను ట్రంప్ కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇరు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో బెదిరించడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. అయితే ట్రంప్ వాదనను భారతదేశం తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. అయినా కూడా ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కడికెళ్లినా.. ఏ నేతతో భేటీ అయినా ప్రపంచ వ్యాప్తంగా భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాటు ఎనిమిది యుద్ధాలు ఆపినట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకోవైపు భారత్ నిరంతరం ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇలా ఇప్పటి వరకు 70 సార్లు ఆ విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: US: మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

ఇప్పుడు ఈ జాబితాలో చైనా కూడా చేరింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్‌తో పాటు చైనా కూడా కృషి చేసిందని విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రకటించారు. భారత్-పాకిస్థాన్‌తో పాటు ఉత్తర మయన్మార్ ఉద్రిక్తతలు, కంబోడియా-థాయ్‌లాండ్, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలు, ఇరాన్ అణు సమస్యతో పాటు ప్రపంచ సంఘర్షణలకు బీజింగ్ శాంతికర్తగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు తర్వాత భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: US: కోర్టు సంచలన తీర్పు.. గర్భంలో శిశువు మరణించినందుకు మహిళకు 18 ఏళ్ల జైలు శిక్ష

అయితే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన ఆయుధాల్లో చైనాకు సంబంధించినవి ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడేమో రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తామేనంటూ డ్రాగన్ దేశం చెబుతోంది. ఇప్పటికే ట్రంప్ వాదనను తోసిపుచ్చుతున్న భారత్.. చైనా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version