మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన హప్నహెమ్బ్రూమ్(30) అనే యువకుడు శుక్రవారం అక్కడే పనిలో చేరాడు. అయితే హప్న ఉన్నట్టుండి సైకోగా మారాడు.
Also Read:Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు..
లేబర్ క్యాంప్లో ఆడుకుంటున్న చిన్నారి రియాకుమారి తలపై హప్న బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. ఆకస్మిక ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. జోడిమెట్ల వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వచ్చిన సైకో వాహనాలపై రాళ్లు విసిరుతూ పరుగులు తీశాడు. దాడిలో రెండు కార్ల అద్దాలు, ఒక ఆటో ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడుతున్న సైకోను స్థానికులు బంధించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు.