Chilakaluripet Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మృతులందరూ చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నారు. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాబుతో పాటు మరో ఆరుగురు మృతి చెందారు.
ప్రమాద ఘటనా స్థలిలోనే నలుగురు మృతి చెందారు. ఇద్దరు గుంటూరు జీజీహెచ్లో, ఒకరు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతులు మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, మరియమ్మ, సువార్తలుగా గుర్తించారు. ఆటోడ్రైవర్ అకస్మాత్తుగా టర్గ్ తీసుకోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

