CM Chandrababu: ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్‌పై చంద్రబాబు సమీక్ష

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’ ప్రణాళికపై సింగపూర్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సుర్బానా జురాంగ్ (SJ), ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సీఎం తన కుప్పం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా స్వర్ణ కుప్పం విజన్ 2029పై తాము ప్రత్యేకంగా రూపొందించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌ను సుర్బానా జురాంగ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా కుప్పం ప్రాంతంలోని వ్యవసాయం, టూరిజం (పర్యాటక) రంగాలలో కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. కుప్పం నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేక భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, ఇక్కడి హార్టికల్చర్ ఉత్పత్తులు, పంటల సరళి, అపారమైన పశుసంపదతో పాటు స్థానిక ప్రజల జీవన విధానం, వారి ప్రధాన ఆదాయ వనరుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా సంస్థల ప్రతినిధులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ వనరులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా ఒక పటిష్టమైన విజన్ ప్లాన్‌ను త్వరితగతిన రూపొందించాలని సీఎం సూచించారు. కుప్పం నియోజకవర్గంలో కేవలం మౌలిక వసతుల కల్పనే కాకుండా, ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రజల జీవన ప్రమాణాలు (స్టాండర్డ్ ఆఫ్ లివింగ్) ఆర్థికంగా పెంచేందుకు అవసరమైన చర్యలను తమ మాస్టర్ ప్లాన్ లో చేర్చాలని సీఎం కోరారు. స్థానిక యువత, ప్రజలలో నైపుణ్యాభివృద్ధిని పెంచడం, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాంతీయంగా అందుబాటులో ఉన్న సహజ వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వంటి కీలక అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేశారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులకు దగ్గరగా ఉంటూ.. ఎంతో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన జీవనానికి అనువైన ప్రాంతంగా ఉన్న కుప్పానికి ఉన్న భౌగోళిక అనుకూలతలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం కుప్పం ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, ఈ పారిశ్రామిక వృద్ధికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను తట్టుకునేలా సరికొత్త ప్రాజెక్టులను డిజైన్ చేయాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు.