CM Chandrababu: నా గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..

Chandrababu

Chandrababu

CM Chandrababu: రాజధాని అమరావతి నిర్మాణంలో రైతుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రైతులది కేవలం త్యాగం మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే అంశమని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం తన గ్రేట్ విజన్‌కు తొలి విజయమని అన్నారు. రైతుల నమ్మకం, సహకారం లేకపోతే అమరావతి రాజధాని సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.

రాజధాని ఎక్కడ అన్నదానిపై తొలుత గందరగోళం
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై స్పష్టత లేకపోయిందని చంద్రబాబు తెలిపారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదికలో మెజార్టీ ప్రజలు రాజధానిని ఈ ప్రాంతంలోనే నిర్మించాలని అభిప్రాయపడ్డారని చెప్పారు. అనంతరం అసెంబ్లీలో చర్చ జరిగి అమరావతిని రాజధానిగా నిర్ణయించినట్లు తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొలి రాష్ట్రంగా ఏర్పడిందని, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమరావతిలో రాజధాని నిర్మించాలని సంకల్పించినట్లు సీఎం వివరించారు.

హైటెక్ సిటీని కట్టినప్పుడు కూడా విమర్శలు
తాను హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించేటప్పుడు కూడా పలువురు విమర్శలు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. రోడ్లు వేసి తాను షో చేస్తున్నానని కొందరు ఎగతాళి చేశారని, అయినా వెనక్కి తగ్గలేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వంటి మౌలిక వసతులను నిర్మించి చూపించానని చెప్పారు. అదే నమ్మకంతో అమరావతి నిర్మాణానికి రైతులు ముందుకొచ్చారని సీఎం తెలిపారు. తాను సైబరాబాద్‌ను నిర్మించిన అనుభవాన్ని చూసి రైతుల్లో విశ్వాసం పెరిగిందని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ప్రాంతాల రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని పేర్కొన్నారు.

రైతులు లేకపోతే అమరావతి లేదు
రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకు రాకపోతే అమరావతి సాధ్యమయ్యేది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ భూములను ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. అమరావతి రైతులది త్యాగమే కాకుండా గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు.

సింగపూర్ మాస్టర్ ప్లాన్.. ఒక్క రూపాయి తీసుకోలేదు
అమరావతిని సింగపూర్ తరహాలో ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలనే సంకల్పంతో తాను సింగపూర్ వెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. తనపై ఉన్న నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అమరావతి మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలు అందించిందన్నారు. ఐకానిక్ భవనాలు, అసెంబ్లీ భవనాలకు సింగపూర్ డిజైన్లు ఇచ్చిందని చెప్పారు. అయితే ఆ డిజైన్లను చూసి కొందరు ‘గ్రాఫిక్స్ రాజధాని’ అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆ డిజైన్లు వాస్తవరూపం దాల్చితే అప్పట్లో విమర్శలు చేసిన రాజకీయ పార్టీలు, నాయకులు ఏమవుతారో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట
అమరావతి విషయంలో గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిందని చంద్రబాబు విమర్శించారు. గతంలో రాష్ట్రానికి సెంటర్ ప్లేస్‌లో 30 వేల ఎకరాలకు పైగా రాజధాని నిర్మించాలని చెప్పిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్, ఎన్నికల తర్వాత తన వైఖరిని మార్చుకున్నారని ఆరోపించారు. అయితే, అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే ఉద్యమమని చంద్రబాబు అన్నారు. ఉద్యమానికి మద్దతుగా తాను జోలె పట్టి న్యాయపోరాటం చేయించానని గుర్తుచేశారు. అమరావతి ప్రజా రాజధాని అని పేర్కొన్నారు. దేశంలోని వివిధ నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి అమరావతిలో పూజలు నిర్వహించామని తెలిపారు. అలాంటి పూజలు వృథా కావని, అమరావతి దేవతల రాజధాని అని సీఎం పేర్కొన్నారు.

అమరావతి దేవతల రాజధాని
మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధానిగా ప్రస్తావించబడిందని చంద్రబాబు అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే కొలువై ఉన్నారని చెప్పారు. ప్రతిరోజూ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అమరావతిని నిర్మించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని సీఎం తెలిపారు. ఇక, రాజధానికి ‘అమరావతి’ అనే పేరు పెట్టాలని రామోజీరావు సూచించారని చంద్రబాబు తెలిపారు. ఆ పేరు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావించి అమరావతి పేరును పెట్టినట్లు చెప్పారు. అయితే రాజధాని నిర్ణయం సమయంలో అసెంబ్లీలో తనకు అనేక సమస్యలు ఎదురయ్యాయని సీఎం గుర్తుచేశారు.

గ్రేట్ విజన్‌కు తొలి సక్సెస్
అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల నమ్మకం, ప్రజల భాగస్వామ్యం, అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలతో అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరావతి రైతుల స్ఫూర్తితో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి, తన విజన్‌ను సాకారం చేస్తానని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..