Business Headlines 08-03-23:
గౌతమ్ అదానీకి నిఫ్టీ షాక్
అదానీ గ్రూపు కంపెనీలకు స్టాక్ మార్కెట్ షాకిచ్చింది. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ నుంచి 4 సంస్థల షేర్లను NSE తీసేసింది. ఈ నిర్ణయం 31వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆల్ఫా 50 ఇండెక్స్ నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్, టోటల్ గ్యాస్ డిలీటయ్యాయి. 100 ఆల్ఫా 30 నుంచి అదానీ పోర్ట్స్ & ఎస్ఈజెడ్ని తొలగించారు. 200 ఆల్ఫా 30 నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ను తీసేశారు. నిఫ్టీ వొలటాలిటీ 50 ఇండెక్స్ నుంచి అంబుజా సిమెంట్స్ మరియు ఏసీసీలను తప్పించారు.
ఇక.. ‘లోకేష్’ తుపాకీలు
CNC పరికరాలను, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ను తయారుచేసే హైదరాబాద్ సంస్థ లోకేష్ మెషిన్స్ లిమిటెడ్.. ఆయుధాల ఉత్పత్తిలోకి ఎంట్రీ ఇచ్చింది. సిటీకి దగ్గరలో ఉన్న మేడ్చల్లో ఈ మేరకు కొత్త విభాగాన్ని ప్రారంభించింది. కేంద్ర రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారైన డాక్టర్ జి.సతీష్రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఆర్డీఓ సహాయ సహకారాలతో మోడ్రన్ తుపాకీని తయారుచేసిన ఈ సంస్థ.. వాణిజ్య ఉత్పత్తి కోసం కొత్త విభాగాన్ని ఏర్పాటుచేసింది.
భారీగా క్రెడిట్ కార్డుల వాడకం
ఇండియాలో క్రెడిట్ కార్డుల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. గత 11 నెలలుగా ప్రతి నెలా క్రెడిట్ కార్డులతో చేస్తున్న కొనుగోళ్లు లక్ష కోట్ల రూపాయలకు పైగానే నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి అన్ని బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య దాదాపు 8 కోట్ల 25 లక్షలు. ఈ కార్డుల వినియోగం రికార్డ్ స్థాయిలో పెరగటంతో బకాయిలు సైతం లైఫ్టైమ్ హయ్యస్ట్ లెవల్కి చేరాయి. జనవరి నాటికి చెల్లించాల్సిన బకాయిలు ఒకటీ పాయింట్ ఎనిమిదీ ఏడు లక్షల కోట్లకు పెరిగాయి.
సీఐఐ-టీకి కొత్త అధిపతులు
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్.. CII తెలంగాణ విభాగానికి కొత్త చైర్మన్గా సి.శేఖర్ రెడ్డి నియమితులయ్యారు. వైస్ చైర్మన్గా డి.సాయిప్రసాద్ వ్యవహరిస్తారు. శేఖర్ రెడ్డి.. రియల్ CSR ఎస్టేట్స్ లిమిటెడ్కి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కాగా సాయి ప్రసాద్.. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇదిలాఉండగా ‘‘తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ అవార్డ్ ఫర్ ఎక్స్లెన్సీ ఇన్ ఐటీ’’ని CII తెలంగాణ విభాగం TCS కంపెనీకి అందజేసింది.
ఏపీలో ‘పవర్’ పెట్టుబడులు
గవర్నమెంట్ కంపెనీ పవర్గ్రిడ్ కార్పొరేషన్.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. రెండు ప్రాజెక్టుల కోసం 4 వేల 71 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. విండ్ ఎనర్జీ జోన్ లేదా సోలార్ ఎనర్జీ జోన్తోపాటు తూర్పు ప్రాంత విస్తరణ పథకం కోసం ఈ నిధులను కేటాయించనుంది. మొదటి ప్రాజెక్టు 2024వ సంవ్సరం చివరికి, రెండో ప్రాజెక్టు 2025వ సంవత్సరం ఆఖరికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.
HALకి IAF బంపరాఫర్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. HAL బంపరాఫర్ పొందింది. రక్షణ శాఖ నుంచి పెద్ద కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ కోసం ఈ సంస్థ 70 ప్రత్యేక విమానాలను తయారుచేయనుంది. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య నిన్న మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ విమానాలను హిందుస్థాన్ టర్బో ట్రైనర్-40 పేరుతో పిలుస్తారు. ఒప్పందం విలువ 6 వేల 800 కోట్ల రూపాయలు కావటం విశేషం. ఈ 70 విమానాలను ఆరేళ్లలో అందించాల్సి ఉంది.