పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 51 వేల కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది PR&RD. అయితే.. గత బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కి 23 వేల కోట్లు కేటాయించారు. చేయూత కింద పింఛన్ల మొత్తాన్ని పెంచాలని PR&RD ప్రతిపాదనలు ఇచ్చింది. చేయూత పథకం కోసం 22 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఆసరా పెన్షన్ల కోసం 12 వేల కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. గ్రామీణ రహదారుల బడ్జెట్ ను రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది PR&RD.
అయితే.. మహిళా స్వయం సంఘాల లోన్ బీమా, ప్రమాద బీమా కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ తో అన్ని ఆవాసాలను అనుసంధానం చేయాలని మంత్రి సీతక్క కోరారు. మిగిలిపోయిన అన్ని ఆవాసాలకు రక్షిత మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టాలని, అడవుల్లో నివసించే ప్రజలకు సైతం కుళాయి నీళ్లు అందించాలన్నారు. అడవుల్లో విద్యుత్ లైన్లు వేసేందుకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని, అడవుల్లో వున్న ఆవాసాల్లో సోలార్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. నీటి సోర్స్ పాయింట్లు దగ్గర్లో ఉండేలా చూసుకోవాలని, గ్రామపంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు శుభ్ర పరచాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగినీటినీ వినియోగించే విధంగా ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు.