ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే టీడీపీ, జనసేనతో జత కట్టిన బీజేపీ రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలతో పాటు, ఎక్కువ మంది ఎంపీలను పార్లమెంటుకు తీసుకెళ్లాలని చూస్తోంది. దాంట్లో భాగంగా రేపు ధర్మవరానికి హోం అమిత్ షా రానున్నట్లు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ధర్మవరం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్ బీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగిస్తారు. అమిత్ షా తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి సత్య కుమార్ పాల్గొంటారు. అమిత్ షా సభ అనంతరం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీకి రానున్నారు.
READ MORE: Tirumala Rain: తిరుమలలో వరుసగా మూడోరోజు కురుస్తున్న వర్షం
మోడీ షెడ్యూల్ ఇదే.. 6న మధ్యాహ్నం 3 గంటలకు మోడీ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని వేమగిరి సభ ,రాజమండ్రి సభ అనంతరం సాయంత్రం 5:45 కు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి అనకాపల్లి పరిధిలోని కశింకోట సభలో పాల్గొంటారు. ఈనెల 8న మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. పీలేరు సభ అనంతరం సాయంత్రం 4 గంటలకు గన్నవరానికి బయలుదేరుతారు. 5 గంటలకు గన్నవరం నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుని.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు.