Ramchander Rao: కల్వకుంట్ల కవిత నేడు తెలంగాణ రాష్ట్ర సేన(TRS) పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పార్టీ పేరు ప్రకటించారు. ఇక కవిత కొత్త పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది.. అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన అందించారని చెప్పారు. “గతంలో టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్ పుట్టబోయే బిడ్డ పేరు టీఆర్ఎస్ అంటా.. ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎన్ని పార్టీలు ఉన్నా బీజేపీకి ఇబ్బంది లేదు.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.” అని రామచందర్రావు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ అధినేత్రి కవిత పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కుంటే బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. “విభజన హామీలు నెరవేర్చకపోతే బీజేపీ ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకి బీజేపీ. తెలంగాణ బీజేపీ ఎంపీలకు సవాల్ విసురుతున్నా.. తెలంగాణ తల్లి బిడ్డలైతే ఏపీలో కలిసిన కనీసం 5 గ్రామాలను వెనక్కి వచ్చేలా చూడాలి. భద్రాచలం వద్ద ఉన్న 5 గ్రామాలు పోతే రాముడి గుడి మునుగుతుంది. గ్రామాలను వెనక్కి తీసుకురావడానికి జాగృతి తరఫున కేంద్రానికి లేఖ రాశాం. మూడు పార్టీలపై అలుపెరగని పోరాటానికి కార్యకర్తలంతా సిద్ధం కావాలి’’ అని కవిత పేర్కొన్నారు.
అనంతరం బీఆర్ఎస్, కేసీఆర్పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “మన కేసీఆర్ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారు. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. జాతీయ పార్టీ పెడతానని చెప్పారు. సింగరేణిలో గనిలో కార్మికుడు చనిపోతే చూసొచ్చే వ్యక్తి. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు. కేటీఆర్ మాట్లాడారంటే అనుకోవచ్చు. ఆయనకు రాజకీయం తెలియదు. ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. ఇళ్లను కూల్చుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి కేసీఆర్ ఎక్కడున్నారు..? మారుతారేమోనని చూశా.. కానీ, నన్నే సస్పెండ్ చేశారు. ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే తాను మాట్లాడాల్సింది. కానీ, మాట్లాడలేదు.. ఇవాళ నాకు అదే జరిగింది. ఉద్యమంలో కొట్టినవారినే తీసుకొచ్చి పట్టం కట్టారు. వాళ్ల అనుచరులు మనవాళ్లను అణగతొక్కారు. ఉద్యమకారులను నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా సరిపోయేది. కండువా వేసుకొని అప్పుడు పిచ్చొల్లలాగా తిరిగాం. ఆ పార్టీలో అమ్మతనం పోయింది, మమకారం పోయింది. అందుకే కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మరబొమ్మ అయ్యారు.” అని కవిత వ్యాఖ్యానించారు.
