NTV Telugu Site icon

Bullet Bike: దారుణం.. బుల్లెట్‌ బైక్‌ కట్నంగా ఇవ్వలేదని విషమిచ్చి చంపేశారు..

Poison

Poison

Bullet Bike: వరకట్న వేధింపులు సమాజంలో వేళ్ళూనుకుపోయాయి. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారని అందరూ అనుకుంటారు. అది నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరొకవైపు వేధింపులకు గురయ్యేవారు, మోసపోతున్నవారు, చేయని తప్పులకు బాధితులుగా మారుతున్న మహిళలు ఉన్నారు. వరకట్నం దాహానికి బీహార్‌లో ఓ మహిళ బలైంది. వివాహ సమయంలో బుల్లెట్‌ బండి కట్నంగా ఇస్తానని ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళను అత్తమామలు విషమిచ్చి హత్య చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని బక్సర్‌ జిల్లాలో పవార్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

Also Read: Gujarat: ముదిరిన “దర్గా” వివాదం.. పోలీస్ స్టేషన్‌పై ఓ వర్గం రాళ్ల దాడి.. ఒకరు మృతి

బక్సర్ జిల్లాలో కట్నంగా బుల్లెట్ మోటార్ సైకిల్ ఇవ్వలేదని ఓ మహిళకు అత్తమామలు విషమిచ్చి హత్య చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం, మహిళకు గత సంవత్సరం వివాహం జరిగింది. బుల్లెట్ మోటార్‌ బైక్‌ డిమాండ్‌ను నెరవేర్చనందుకు నిరంతరం శారీరక వేధింపులకు గురిచేశారు. ఘటన జరిగిన రోజు ఆమె ఆరోగ్యం క్షీణించిందని అత్తమామలు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు విషం ఎక్కించారని, ఆ తర్వాత ఆమె చనిపోయిందని తెలిపారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కట్నం కింద ద్విచక్రవాహనం ఇవ్వలేదని విషమిచ్చి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకొన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.