Dubai: విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్తో ఫోటోలు, వీడియోలు తీయడం ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. సరదాకో, తెలియకో చేసిన ఒక చిన్న పొరపాటు.. ఏకంగా పదేళ్ల జైలు శిక్షకు దారితీసింది. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా సదర్ బ్లాక్ పరిధిలోని రఫీ ఇందర్వా గ్రామానికి చెందిన అమీరుల్ మియాన్ కుమారుడు వసీం అక్రమ్ ఉపాధి కోసం ఈ ఏడాది మార్చిలో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) పరిశ్రమలో పనిచేసే ఒక కాంట్రాక్టర్ వద్ద కూలీగా చేరి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, దుబాయ్ వెళ్లే క్రమంలో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు వసీం అక్రమ్ తన మొబైల్ ఫోన్తో కొన్ని ఫొటోలు, వీడియోలు రికార్డు చేశాడు. దుబాయ్లోని కఠినమైన భద్రత, గోప్యత (ప్రైవసీ) చట్టాల ప్రకారం విమానం లోపల ఫొటోలు, వీడియోలు తీయడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే వసీం అక్రమ్ను అక్కడ అరెస్ట్ చేసి, విచారణ అనంతరం దుబాయ్ కోర్టు ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఈ విషయం తెలియడంతో వసీం అక్రమ్ స్వగ్రామం ఇందర్వాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. తన కుమారుడు ఎటువంటి దురుద్దేశంతో ఆ ఫొటోలు తీయలేదని, అతడు చాలా అమాయకుడని వసీం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జ్ఞాపకంగా దాచుకోవడానికో లేదా అనుకోకుండానే ఆ ఫొటోలు తీసి ఉంటాడని, అక్కడి కఠినమైన నియమ నిబంధనల గురించి అతనికి అస్సలు తెలియదని వారు చెబుతున్నారు. గడిచిన రెండు నెలలుగా వసీంతో మాట్లాడటానికి వీలు లేకుండా పోయిందని, అతడిని రెండు నెలల క్రితమే అరెస్ట్ చేసినప్పటికీ.. ఈ విషయం తమకు గురువారం నాడే తెలిసిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వసీం తల్లి శైదా ఖాతూన్ తన కొడుకు అరెస్ట్ అయిన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. “నా కొడుకు శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే, పోలీసులు వచ్చి అతనితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత విచారణ జరిపి మిగిలిన వారందరినీ వదిలేశారు. కానీ, నా కొడుకు మొబైల్ ఫోన్లో విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు దొరకడంతో అతడిని మాత్రం జైలుకు పంపారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ పరిస్థితుల్లో న్యాయం చేయాలంటూ వసీం కుటుంబ సభ్యులు గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ పవన్ కుమార్ సిన్హాను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. వసీం ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు, సోదరి, భార్య సల్మా ఖాతూన్, ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారని.. ప్రస్తుతం అతని భార్య అనారోగ్యంతో బాధపడుతోందని జిల్లా మేజిస్ట్రేట్కు వివరించారు. ఆ కుటుంబానికి వసీం ఒక్కడే ఆధారమని, అతను జైలుపాలు కావడంతో ఆదాయ వనరు పూర్తిగా కోల్పోయి రోడ్డున పడ్డామని శైదా ఖాతూన్ వాపోయారు. ఈ వ్యవహారాన్ని గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ పవన్ కుమార్ సిన్హా తీవ్రంగా పరిగణించారు. బాధితుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును, వినతిపత్రాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇస్తూ.. దీనిపై తక్షణమే హోం శాఖకు సమగ్ర నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. తెలియక చేసిన పొరపాటుకు ఒక పేద కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో పడిపోవడం స్థానికంగా అందరినీ కలచివేస్తోంది.
