Viral News: సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం, వైరల్ అవ్వాలనే పిచ్చి ఈ రోజుల్లో మనుషులతో ఏమేం చేయిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తే, మరికొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారు. ఇంకొందరైతే కేవలం లైకులు, కామెంట్ల కోసం తమ సొంత జీవితాన్నే నవ్వులపాలు చేసుకుంటారు. కానీ, బిహార్లోని కటిహార్ జిల్లాలో ఓ ఘోర ఉదంతం వెలుగు చూసింది. భార్యపై అనుమానం, కోపం, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే తపనతో ఓ వ్యక్తి తన భార్య ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిందితుడికి 2023లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయినప్పటి నుంచి అతనికి భార్యపై విపరీతమైన అనుమానం ఉండేది. ఆమె పుట్టింటికి వెళ్లినా, ఫోన్ కాస్త ఆలస్యంగా ఎత్తినా, లేదా బంధువులతో మాట్లాడినా అతడు లేనిపోని అనుమానాలు పెంచుకునేవాడు. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే భ్రమలో బతికేవాడు. ఈ అనుమానాల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు పెరిగి, భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత కక్ష పెంచుకున్న సదరు భర్త, ఆమెను డిజిటల్గా వేధించి, సమాజంలో పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియో క్లిప్లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టాడు. తన వ్యక్తిగత జీవితం ఇలా బహిరంగం కావడంతో ఆ మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
సాధారణంగా ఇలాంటి సైబర్ నేరాల వెనుక రెండు ప్రధాన కారణాలు ఉంటాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఒకటి పగ తీర్చుకునే సైకో మనస్తత్వం, రెండు సోషల్ మీడియాలో ఎలాగైనా సరే అందరి దృష్టిని ఆకర్షించాలనే వింత కోరిక. ఈ కేసులో నిందితుడు కూడా చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫేమస్ అవ్వాలని ఆరాటపడేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ పిచ్చిలోనే అతను అన్ని హద్దులు దాటి భార్య గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించాడు. ఈ దారుణంపై సదరు మహిళ 2026, జనవరి 9న కటిహార్ సైబర్ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించారు. కేసు నమోదైన తర్వాత నిందితుడు కొంతకాలం పరారీలో ఉన్నప్పటికీ, పోలీసులు సాంకేతిక నిఘా సహాయంతో అతడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టినట్లు ఒప్పుకున్నాడు, కానీ భార్యపై ఉన్న కోపం, అనుమానమే దానికి కారణమని సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు.
ఈ ఘటనపై కటిహార్ సైబర్ డీఎస్పీ ఆశీఫ్ ఆలం స్పందిస్తూ.. “ఎవరైనా సరే, ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టప్రకారం నేరం. ఆ పని చేసింది భర్త అయినా, భార్య అయినా, స్నేహితులైనా సరే.. అవతలి వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను, గోప్యతను (Privacy) ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ ప్రైవేట్ కంటెంట్ను ఇంకా ఎక్కడెక్కడ షేర్ చేశారు, డిలీట్ చేయడానికి ఏమైనా ప్రయత్నించారా అనే కోణంలో ఆ డివైజ్ను ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

