Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది…. అన్నాడీఎంకేలో ముదిరిన ముఠా కుంపటికి ఎట్టకేలకు తెరపడింది. పళనిస్వామి, ఎస్పీ వేలుమణి వర్గాల మధ్య సీక్రెట్ డీల్ కుదిరింది. ఈపీఎస్ వైఖరిపై గుర్రుగా ఉన్న 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దారికి వచ్చారు. విశ్వాస పరీక్ష లేఖల గడువు ముగియనుండటంతో హైకమాండ్ అలర్ట్ అయింది. టీవీకే పార్టీకి ఇచ్చిన మద్దతును విత్ డ్రా చేసుకోవాలని ఈపీఎస్ తేల్చి చెప్పారు. తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయం హీటెక్కింది. అయితే, ఈ డీల్ అయ్యేలోగా మరింత మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి టీవీకే పార్టీలో చేర్చుకోవాలని యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు విజయ్..
తమిళనాడు ప్రతిపక్షం అన్నాడీఎంకే లో గత కొన్ని రోజులుగా సాగుతున్న అంతర్గత సంక్షోభానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి, కీలక నేత ఎస్పీ వేలుమణి వర్గాల మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత ఒక ఒప్పందం కుదిరిందని టాక్ నడుస్తుంది. దీంతో పార్టీ ముక్కలవుతుందనే ప్రచారానికి చెక్ పడింది. కొంతకాలంగా ఈపీఎస్ ఒంటెత్తు పోకడలపై, వేలుమణి అనుసరిస్తున్న వ్యూహాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు శాంతించినట్లు తెలుస్తోంది. ఈ రాజీ ఫార్ములాతో అన్నాడీఎంకే క్యాడర్ ఊపిరి పీల్చుకుంది. ఈ వివాదానికి ప్రధాన కారణం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష. ఆ సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటేశారు. అయితే, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పీకర్కు లేఖ ఇచ్చేందుకు ఈ నెల 28వ తేదీతో గడువు ముగియనుంది. ఈ లోపే పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకపోతే నష్టం జరుగుతుందని భావించిన అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. స్పీకర్ గడువు ముగిసేలోగా ఎమ్మెల్యేలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈపీఎస్ తీవ్రంగా శ్రమించారు.
ఇదే సమయంలో TVK పార్టీకి ఇచ్చిన మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని పళనిస్వామి తన వర్గీయులకు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికారికంగా టీవీకే పార్టీలో చేరడం పార్టీలో కలకలం రేపింది. ఈ వలసలు మరింత మందికి విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకే ఈపీఎస్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. టీవీకేతో సంబంధాలను తెంచుకుంటేనే పార్టీ మనుగడ సాధ్యమని ఆయన భావిస్తున్నారు. మరోవైపు, తిరుగుబాటు జెండా ఎగరేసిన ఎమ్మెల్యేలపై పెట్టిన అనర్హత పిటిషన్లను వెనక్కి తీసుకోవాలని పళనిస్వామి కోరారు. అయితే, దీనిపై వేలుమణి మద్దతుదారులు గట్టి పట్టుబడుతున్నారు. కేవలం మాటలతో కాకుండా, అనర్హత పిటిషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే తాము పూర్తిగా పార్టీ లైన్కు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వేలుమణి వెనుక 16 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఈపీఎస్ కూడా వారి డిమాండ్లను పరిశీలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీనియర్ నేత తంగమణి రాయబారిగా రంగంలోకి దిగారు. ఎస్పీ వేలుమణి వర్గం తరఫున ఆయన ఈపీఎస్ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఇరు వర్గాల మధ్య ఉన్న డిమాండ్లు, సరుకులు, రాజకీయ భవిష్యత్తుపై తంగమణి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అనర్హత పిటిషన్ల ఉపసంహరణతో పాటు, భవిష్యత్తులో పార్టీ నిర్ణయాల్లో వేలుమణి వర్గానికి తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఆయన హామీలు కుదిర్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి తాత్కాలికంగా అన్నాడీఎంకే సంక్షోభం సర్దుమణిగినా, రాబోయే రోజుల్లో సమీకరణాలు ఎలా మారతాయనేది ఆసక్తికరంగా మారింది. నలుగురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరడం ఇప్పటికే పార్టీ బలాన్ని కొంత తగ్గించింది. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఈపీఎస్ సడలింపులు ఇవ్వక తప్పలేదు. ఈ నెల 28న స్పీకర్కు ఇచ్చే లేఖల ప్రక్రియ ముగిసాక, తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే వ్యూహం పూర్తిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఏఐడీఎంకే బలం 43 మందికి చేరింది..
