భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని 13 ప్రధాన విభాగాలుగా విభజించి.. వాటిని 89 సెక్టార్లుగా రూపొందించారు. ప్రతి సెక్టార్లో 80 నుంచి 100 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. మొత్తం భద్రతా ఏర్పాట్లను 30 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యక్షంగా బందోబస్తును సమన్వయం చేస్తున్నారు. సభా ప్రాంగణం, ఎయిర్పోర్ట్ జోన్, వీఐపీ రూట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు భోగాపురానికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంగళగిరి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న ఆయన.. అక్కడి నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భోగాపురానికి చేరుకోనున్న పవన్.. అక్కడి మిరాకిల్ సిటీ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. శనివారం ఉదయం 10.45 గంటలకు గవర్నర్, సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత పవన్ హైదరాబాద్కు బయలుదేరనున్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా శుక్రవారం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకోనున్నారు. సీఎం విశాఖకు చేరుకున్న అనంతరం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి లోకేష్ నేరుగా భోగాపురానికి వెళ్లనున్నారు. ఇద్దరూ శనివారం జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రితో కలిసి పాల్గొననున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్కు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది.

