తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ ఏఎం రిజ్వీ తో కలిసి ఆ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సోలార్ విద్యుత్ ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దశ దిశ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశాలు ఇచ్చారు. గృహ కమర్షియల్ ఆఫీసు భవనాలపై సోలార్ సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నదని, ఒక కిలో వాట్స్ నుంచి మూడు కిలో వాట్స్ వరకు కిలో వాట్కు 18 వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తామని ఆయన వెల్లడించారు. మూడు కిలో వాట్స్ నుంచి పది కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు 9వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. టీ ఎస్ రెడ్కో సంస్థ నిర్వహణ, బోర్డు కమిటీ, సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, సంస్థ సిబ్బంది పని తీరు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. జానయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు.