Site icon NTV Telugu

Bhatti Vikramarka : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని మన రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరినమని, సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయవద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని, బీఆర్ఎస్ పార్టీకి కాలేశ్వరం ఏటీఎం లాగా మారిందని ప్రధానమంత్రి మోడీ హోం మంత్రి అమిత్ షా లు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాలేశ్వరం నిర్మాణంలో దోపిడీ జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం ప్రకారమే మోడీ, అమిత్ షా లు మాట్లాడి ఉండవచ్చని, కేంద్రంలో ఉన్న బిజెపి దగ్గర కాలేశ్వరం దోపిడి గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ కుమ్మక్కయ్యారు కాబట్టే కాలేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్ర బీజేపీ నాయకులు బాధ్యత లేనట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల నగదు జమ, నోట్ల రద్దు సమయంలో బయటికి తీస్తానన్న నల్లధనం గురించి బిజెపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు.

అంతేకాకుండా.. ‘మోసం మోసమని బతికే బిజెపి లాగా కాంగ్రెస్ ఉండదు. రాష్ట్రంలో చిన్న భిన్నంగా ఉన్న పాలన వ్యవస్థను గాడిలో పెట్టి జవాబుదారి పాలన అందిస్తున్నాము. గత ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగులు 21వ తారీకు వరకు జీతాలు తీసుకున్న దుస్థితి నుంచి మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే ఆర్థిక స్థితికి మెరుగు పరిచాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అరాచకత్వంపై శ్వేత పత్రం విడుదల చేసాం. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా జెన్కో, ట్రాన్స్ కో, డిస్కోలో ఉన్న అప్పులను బయట పెట్టాం. వ్యవసాయ శాఖలో సమీక్ష చేసి ప్రజలకు జవాబుదారీగా భూసార పరీక్షలు పెంచి రైతులకు అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉండే విధంగా సమయాత్తం చేశాం. కాలేశ్వరం కార్పొరేషన్ పేరిట లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అధోగతి పాలు చేసిన కాలేశ్వరం గురించి వాస్తవాలు బయట పెట్టాం. మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలపై నివేదిక తయారవుతున్నది త్వరలో బయట పెడతాం.

 

పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి అతిపెద్ద సవాల్ గా మారిన డ్రగ్స్ నిరోధానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఆ శాఖకు కావాల్సిన నిధులను మంజూరు చేశాం. 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 6.50 కోట్ల మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలకు సాయాన్ని పెంచి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. విద్యా, వైద్య ఉపాధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రణాళిక సంఘాన్ని తిరిగి పునరుద్ధరణ చేసాం. శాఖకు సీనియర్ ఐఏఎస్ అధికారిని సెక్రటరీగా నియమించాం. ఆర్దిక వనరులను సక్రమంగా ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వెచ్చిస్తాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పైరవీలు, ప్రశ్న పత్రాలు లీకు కాకుండా పకడ్బందీగా టిఎస్పిఎస్సి ద్వారా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాం. నిరుద్యోగ యువతకు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అనుగుణంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సంక్షేమ రంగంపై ఇందిరమ్మ ప్రభుత్వం లోతైన అధ్యయనం చేస్తున్నది ఇంక్లూసివ్ గ్రోత్లోకి ప్రజలను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఒత్తిడి లేని పాలన అందిస్తామని చెప్పినట్టుగానే చేస్తున్నాం.

 

శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా గుర్తించి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. పైరవీకారులు, తాబేదారులకు తావు లేకుండా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా 30 రోజులు ప్రజాపాలన అందించింది. ప్రజలు ఇచ్చిన ఈ పదవులను హోదా గా కాకుండా బాధ్యతగా స్వీకరించి పారదర్శకంగా జవాబుదారీగా ప్రజాపాలన అందించాం. ఆరు గ్యారెంటీల హామీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించాం. రాష్ట్రంలో విద్యా, వైద్యం బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేసి విద్యార్థులందరికీ ప్రపంచీకరణలో భాగంగా పెరుగుతున్న పోటీ తత్వాన్ని ఎదుర్కొనే విధంగా వృత్తిపరమైన కోర్సులు తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం సంకల్పిస్తున్నది. ప్రజల అవసరాలు తీర్చేటు వంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు తీసుకువస్తాం.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Exit mobile version