Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం

  • రైతు భరోసా నిధుల విడుదల సభ
  • బీఆర్ఎస్ నేతలపై భట్టి విమర్శలు
  • రూ.2.08 లక్షల కోట్ల అప్పుల ప్రస్తావన
  • రైతులకు డబుల్ సాయం చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : శిల్పకళావేదికలో అట్టహాసంగా నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తమ ప్రభుత్వానికి రైతుల కష్టాలు, వారి పంట కొనుగోలు సమస్యలు పూర్తిగా తెలుసన్నారు. అందుకే రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేశామని, అన్నదాతలకు పూర్తి భరోసా కల్పించేందుకే ఈ నిధులను విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతు భరోసా ఇచ్చి తీరుతామని, తాము అబద్ధాలు చెప్పి పొద్దు గడుపుకునే రకం కాదని హితవు పలికారు.

ఇద్దరు నాయకులు రాష్ట్రంపై పడి కట్టుకథలు అల్లుతున్నారు

గత ప్రభుత్వంలోని బావబామ్మర్దుల (కేసీఆర్, హరీష్ రావు) తీరుపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంపై పడి వీరిద్దరూ కట్టుకథలు అల్లుతూ తిరుగుతున్నారని మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఇప్పుడు కాంగ్రెస్ పెట్టేది ఆశీర్వాద సభ కాదు క్షమాపణ సభ అనడం చూస్తుంటే.. అసలు ఆయన పదేళ్లు మంత్రిగా ఎలా పనిచేశాడో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రాన్ని దారుణంగా దోపిడీ చేసి, ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసి రైతులకు ఏం చేసిందో తాము లెక్కలు తీశామని, వారు పదేళ్ల పాలనలో కేవలం 2 లక్షల 88 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాన్ని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పాపాలకు రూ. 2.08 లక్షల కోట్ల అప్పు కడుతున్నాం

తాము అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా 1 లక్ష 56 వేల కోట్లు ఖర్చు చేశామని, అయితే తాము చేసిన పనులను సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని భట్టి విక్రమార్క అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు తాము ఇప్పుడు అసలు, వడ్డీలు కడుతున్నామని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పుల కోసం ప్రస్తుతం తమ ప్రభుత్వం 2 లక్షల 8 వేల కోట్ల రూపాయలను కేవలం అప్పులు కట్టడానికే ఉపయోగిస్తోందని వెల్లడించారు. ఒకవేళ కేసీఆర్ ఆనాడు అప్పులు చేయకుండా ఉండి ఉంటే, ఈ 2 లక్షల 8 వేల కోట్లను నేరుగా రైతుల కోసమే ఖర్చు చేసేవాళ్లం కదా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నేతలు నోటికి వచ్చినట్లు తిడుతున్నా భరిస్తూ, వారు తెచ్చిన అప్పులు కడుతూనే రైతులకు తాము డబుల్ సాయం అందిస్తున్నామని భట్టి పేర్కొన్నారు. రైతులు పండించిన పంట వారి కుటుంబాలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్తూ.. నిత్యం తప్పుడు ప్రచారాలు చేసే ఇలాంటి నాయకుల పట్ల రైతాంగం జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.