Bengaluru Cafe Charges Gas Fee for Lemon Juice: కర్ణాటకలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఒక హోటల్ యాజమాన్యం వినియోగదారులకు అదనపు భారాన్ని మోపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగళూరులోని ఓ కేఫ్లో నిమ్మకాయ జ్యూస్ తాగిన కస్టమర్లు బిల్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఉండాల్సిన బిల్లుకు అదనంగా ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట 5 శాతం అదనంగా వసూలు చేయడం వివాదానికి దారి తీసింది.
ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వినియోగదారులు రెండు గ్లాసుల నిమ్మరసం ఆర్డర్ చేశారు. వాటి మొత్తం ధర రూ.358 కాగా.. అదనంగా గ్యాస్ సంక్షోభ ఛార్జ్ పేరుతో రూ.17.01 వసూలు చేశారు. నిమ్మరసం వంటి సాధారణ పానీయానికి గ్యాస్ ఛార్జ్ ఎలా వేస్తారని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు కూడా హోటల్ చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Also Read: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఉద్యోగస్తులకు జాక్పాట్!
ఈ ఘటనపై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల హక్కుల కమిషన్ స్పందించింది. హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే విధంగా ఇలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం సరైంది కాదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసే విధానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటనతో హోటళ్లలో అదనపు ఛార్జీలపై మరింత చర్చ మొదలైంది.
