Bangladesh US Trade Deal: ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మొత్తం భారత్- యూఎస్ ట్రేడ్ డీల్స్పై ఆసక్తి కనబరిచింది. ఈ డీల్స్ ద్వారా అటు అమెరికా ఇటు భారత్ భారీగానే లాభపడే అవకాశం ఉంది. ఈ డీల్ ప్రకటించిన వెంటనే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బంగ్లాదేశ్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ సైతం అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. కానీ ఈ ఒప్పందం పూర్తిగా రహస్యంగా జరగడం అక్కడి పరిశ్రమ వర్గాలను భయపెట్టింది. ఈ ఒప్పందం గురించి బహిరంగంగా ఏ సమాచారం బయటకు రాలేదు. దీంతో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ డీల్లో అసలు ఇందులో ఏముంది? ఎవరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోలేదు. ఇది తాత్కాలిక ప్రభుత్వం. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఇలాంటి కీలక ఒప్పందం చేసే నైతిక హక్కు ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
READ MORE: IP66, IP68, IP69 రేటింగ్స్, 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో Oppo Reno 15c అమ్మకాలు షురూ!
ఈ డీల్పై ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు ఈ అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన పరిణామాల వెనుక ఇస్లామిక్ శక్తులతో పాటు అమెరికా ‘డీప్ స్టేట్’ మద్దతు ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాతే యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చేయబోతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ఒప్పందం గురించి ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా టెక్స్టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ రంగం భయపడుతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ఇదే రంగం ఆధారంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల వల్ల వస్త్ర పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఊగిపోవచ్చు.
READ MORE: Shocking: యువతిపై అత్యాచారం, 17 మందికి డీఎన్ఏ పరీక్షలు.. నిజం తెలిసి అంతా షాక్..
ఈ ఒప్పందం చట్టబద్ధతపై ప్రశ్నలు ఉన్నాయి. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ కేవలం మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 9న అమెరికా–బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్పై సంతకాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు, తమ పదవీకాలం ముగియబోతున్న సమయంలో యూనస్ ప్రభుత్వం ఇంత తొందరగా ఎందుకు ఈ ఒప్పందం చేస్తోంది? అన్నది చాలామంది అడుగుతున్న ప్రశ్న. బంగ్లాదేశ్లోని ప్రముఖ పత్రిక ‘ప్రథమ్ ఆలో’ కథనం ప్రకారం.. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేసింది. అందుకే ఈ ట్రేడ్ డీల్ ముసాయిదా ప్రజలకు తెలియడం లేదు. అంటే ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ ఆర్థికవేత్త అనూ మహమ్మద్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు పోర్టులను లీజుకు ఇవ్వడం, ఆయుధాలు దిగుమతి చేయడం, అమెరికాతో తలవంచే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఇంత తొందరగా జరుగుతున్నాయి అని ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా లేవని, అవాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ లాబీలు యూనస్ ప్రభుత్వంలోకి ప్రవేశించి, ఎలాగైనా ఈ ఒప్పందాలు జరిగేలా చూస్తున్నాయని చెప్పారు.
READ MORE: Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
మరోవైపు, మొహమ్మద్ యూనస్కు ఇస్లామిక్ పార్టీ జమాత్-ఎ-ఇస్లామీ మద్దతుతోనే తాత్కాలిక ప్రభుత్వ పగ్గాలు అప్పగించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇదే సమయంలో అమెరికా దౌత్యవేత్తలు జమాత్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న కథనాలు రావడం గమనార్హం. ఫిబ్రవరి 12 ఎన్నికల్లో జమాత్ ఒక కీలక రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉందని కూడా అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2న కోల్కతాలో జరిగిన ఒక వర్చువల్ కార్యక్రమంలో షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఒక నకిలీ ఎన్నికల వైపు వెళ్తోందని అన్నారు. విదేశీ శక్తులకు అనుకూలంగా ఉండే బలహీన ప్రభుత్వాన్ని తయారు చేయడమే దీని ఉద్దేశమని విమర్శించారు. యూనస్ ప్రభుత్వం ఇస్లామిస్టుల మద్దతుతో, రహస్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ ఎన్నికలు కేవలం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికే కాదు. అదే రోజు ‘జూలై చార్టర్’పై ప్రజలు ఓటు వేయనున్నారు. ఈ చార్టర్ను యూనస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. దీనికి ‘అవును’ ఓటు వేయాలని ప్రచారం చేస్తోంది. ఈ చార్టర్ ద్వారా రాజ్యాంగంలో మార్పులు చేసే అవకాశం ఉంది. 2024లో హసీనా వ్యతిరేక ఆందోళనల తర్వాత రూపొందించిన ఈ మార్పులు, తాత్కాలిక ప్రభుత్వం చేసిన తప్పులను కాపాడేందుకే అన్న అనుమానాలు ఉన్నాయి. యూనస్ ప్రభుత్వం ఇంత తొందరగా అమెరికాతో ఒప్పందం ఎందుకు చేయాలనుకుంటోంది? 2025 ఏప్రిల్లో ట్రంప్ 100 దేశాలపై రిసిప్రోకల్ టారిఫ్ ప్రకటించినప్పుడు, బంగ్లాదేశ్పై 37 శాతం భారీ టారిఫ్ పడింది. జూన్లో నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35 శాతానికి, ఆగస్టులో 20 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ చెబుతోంది. ఎక్కువగా గార్మెంట్ రంగానికి చెందినవారే భయపడుతున్నవారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతుండటం తమను ఆందోళనకు గురి చేస్తోందని గార్మెంట్ తయారీదారుల సంఘం నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందాలు చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో బంగ్లాదేశ్ జుట్టు అంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చివరికి ఏం జరగనుందో వేచి చూడాలి.