NTV Telugu Site icon

Bandi Sanjya: రాహుల్ కి ఛాలెంజ్.. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా..!

Bandi Sanjay Rahul Gandhi

Bandi Sanjay Rahul Gandhi

Bandi Sanjya: తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందన్నారు. భారతదేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే. అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయని పార్టీ కాంగ్రెస్ అన్నారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి రాహుల్ గాంధీ ఓబీసీల జపం చేయడం కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు.

తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని మండిపడ్డారు. బీసీలను అవమానించడమే. మొన్న కేసీఆర్ కొడుకు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయన్నారు. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీసీలకు ఓట్లు అడగాలని తెలిపారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల నుండి ఆ తరువాత అన్ని ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీట్లను, ఓట్లను సాధించిన పార్టీ బీజేపీ అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన పార్టీ బీజేపీ… తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమన్నారు.

పేదింటి ఓబీసీ బిడ్డ నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసిన చరిత్ర బీజేపీకి ఉందని గుర్తుచేశారు. 27 మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా చేసిన పార్టీ బీజేపీ అన్నారు. దళిత, ఆదివాసీ, మైనారిటీ బిడ్డలను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే అని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అన్నారు. అదే బాటలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేయడం తథ్యమన్నారు. మరి కాంగ్రెస్ చేసిందేమిటి? 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదు? పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానం కోల్పోయి కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమయ్యాకే ఓబీసీ కులగణన గుర్తు కొచ్చిందా? తెలంగాణలో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పార్టీగా హీనదశకు చేరిన తరువాత ఓబీసీలు గుర్తుకొచ్చారా? పార్లమెంట్ లో పట్టుమని 10 శాతం సీట్లు కూడా లేని పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రతిపక్ష స్థానం కోల్పోయి మరణశయ్యపై ఊగిసలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కులగణన ఎట్లా చెేపడుతుందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ఓబీసీ జపం చేస్తున్న రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు? రాష్ట్రంలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్దమా? ఓబీసీ కులగణన విషయంలో రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? ఈ మేరకు ప్రకటన చేసే సత్తా ఉందా? కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీలపట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో అధికారంలోకిి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ ను బీసీలే రాజకీయ సమాధి చేయడం తథ్యం. బీసీలంతా ఏకమై దమ్ము చూపూ సమయమొచ్చింది. బీసీలను అడుగడుగునా అవమానిస్తునన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరుతున్నా.