NTV Telugu Site icon

HCA Funds Issue: హెచ్‌సీఏలో నిధుల గోల్‌మాల్‌ కేసు .. హైకోర్టుకు అజారుద్దీన్

Azharuddin

Azharuddin

HCA Funds Issue: హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్‌మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి. హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజహరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కోట్ల రూపాయల నిధులను అజాహరుద్దీన్ అండ్ కో పక్కదారి పట్టించిందని, టెండర్ల పేరుతో థర్డ్ పార్టీ కి నిధులు కట్టబెట్టిందని హెచ్‌సీఏ నిధులపై ఆడిట్ నిర్వహించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ నిర్ధారించింది.

Also Read: IND vs ENG Pitch Report: 300 పరుగులు సాధిస్తే విజయమే!.. ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్

ముఖ్యంగా క్రికెట్ బాల్స్ కొనుగోలు లో భారీ గోల్‌మాల్‌ జరిగిందని కమిటీ నిగ్గుతేల్చింది. ఒక్కో బాల్ ను 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ ఇచ్చారని, ఇలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 57 లక్షలు నష్టం కలిగించారని కమిటీ తెలిపింది. అలాగే బకెట్ చైర్స్ కొనుగోలు పేరుతో జరిగిన గొల్‌మాల్‌లో హెచ్‌సీఏకు 43 లక్షలు నష్టం జరిగిందని కనుగొన్నారు. ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరుతో 1.50 కోట్లు హెచ్‌సీఏకు నష్టం వాటిలినట్టుగా కమిటీ అభిప్రాయపడింది. జిమ్ పరికరాల పేరుతో 1.53 కోట్లు నష్టం.. ఇలా కోట్లాది రూపాయల హెచ్‌సీఏ నిధులను దోచుకున్నారని కమిటీ రిపోర్ట్‌ ఇచ్చింది.

2019-2022 మధ్య హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ ఉన్న సమయంలో అక్రమాలు జరిగినట్టు ప్రత్యేక విచారణ కమిటీ నిర్ధారించింది. హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజారుద్దీన్‌ పై నాలుగు కేసులు నమోదు కాగా.. . ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉప్పల్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అజారుద్దీన్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.