Ayesha Meera Murder Case Closed: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ (CBI) అధికారులు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక (ఫైనల్ రిపోర్ట్)ను న్యాయస్థానం ఆమోదించింది. నివేదికను పరిశీలించిన అనంతరం కేసును క్లోజ్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండవ సారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం, ఆ శరీర అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. తమ కుమార్తె శరీర అవశేషాలను అప్పగించాలని కోరుతూ ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా తమ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ ద్వారా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
READ MORE: Donald Trump: “ఇది చాలా అవమానం”.. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఫైర్
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ ఉత్తర్వులు జారీ చేస్తూ తల్లిదండ్రుల విజ్ఞప్తిని అనుమతించారు. ఫిబ్రవరి 27వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు బాధిత తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని ఆమె ఆదేశించారు. కోర్టులో గుర్తింపు పంచనామా జరిపిన అనంతరం, ప్రాసిక్యూషన్ అవసరమైన భద్రత, సరైన వాహన సదుపాయం కల్పించి, తల్లిదండ్రులతో పాటు వారి స్వస్థలమైన తెనాలికి వెళ్లాలని కోర్టు సూచించింది. తెనాలిలోని స్మశాన వాటికలో వారి మతాచారం ప్రకారం ఆయేషా మీరా ఆఖరి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించాలని అధికారులను ఆదేశించింది. ఈ అంత్యక్రియల ప్రక్రియ మొత్తం సరైన పద్ధతిలో జరుగుతున్నట్లు రికార్డ్ చేయాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఆ సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.