NTV Telugu Site icon

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. మరింత ఈజీగా సర్టిఫికెట్స్‌

Ap Govt

Ap Govt

Andhra Pradesh: సర్టిఫికెట్స్‌ కోసం రోజుల తరబడి అధికారుల వెంట తిరగాల్సి వస్తుందా? స్కూల్‌, కాలేజ్, ఉద్యోగం మానేసి సర్టిఫికెట్స్‌ కోసం ప్రయత్నాలు సాగించాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇక నో టెన్షన్‌.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్య, ఉద్యోగం, ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. ఈ మేరకు సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, నివాస ధృవపత్రం, బర్త్‌ డే సర్టిఫికెట్‌కాకుండా.. ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్‌ ఒకసారి తీసుకుంటే సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు.

Read Also: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?

ఇక, ఒకసారి పొందిన సర్టిఫికెట్లను శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని, ప్రతిసారీ కొత్త సర్టిఫికెట్‌ కోసం ఒత్తిడి తేవద్దని పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య శాఖలు, స్కిల్‌ డెవలప్‌మెంట్, వ్యవసాయ శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ సర్టిఫికెట్లు ఎక్కడైనా పోయినా, వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. గ్రామ, వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో అదే నంబర్‌తో కొత్తది పొందే వెసులుబాటు కూడా కల్పించింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్. కాగా, వివిధ రకాల సర్టిఫికెట్స్‌ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే.. తహసీల్దార్, ఎంపీడీవోలతో సహా వివిధ మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సచివాలయాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి.. వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను సేకరించడం.. వారికి వెంటనే వివిధ రకాల సర్టిఫికెట్లు అందించిన విషయం తెలిసిందే.