ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ల కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అక్టోబర్ 19న మొదలయ్యే వన్డే సిరీస్ జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం దక్కింది. రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ సారథిగా ఎంపికయ్యాడు. రెండు సిరీస్లలో చాలా తక్కువ మందికి చోటు దక్కగా.. అందులో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఇటీవలి సిరీస్లలో జట్టులో ఉంటున్నా.. ఎక్కువగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో గొప్ప ప్రదర్శన అయితే చేయలేదు. అయినా కూడా హర్షిత్ జట్టులో కొనసాగుతున్నాడు. హర్షిత్ ఎంపికపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ అయ్యారు.
క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు హర్షిత్ రాణా ఇష్టమైన వ్యక్తి అని విమర్శించారు. ‘గంభీర్కు హర్షిత్ రాణా ఇష్టమైన ప్లేయర్. అందుకే అతడు భారత జట్టులో ఉంటున్నాడు. హర్షిత్కు గౌతీ చాలా ప్రాధాన్యం ఇస్తాడు. గంభీర్ ఇష్టమైన ప్లేయర్ జాబితాలో శుభ్మన్ గిల్ తర్వాత హర్షిత్ పేరే ఉంటుంది’ అని శ్రీకాంత్ చమత్కరించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన రాణా.. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో జట్టులోనే ఉన్నాడు. ఆసియా కప్, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఆడిన బుమ్రాకు ఆస్ట్రేలియా పర్యటనలోని వన్డేలకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది.
Also Read: 314 Runs: మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. వన్డేల్లో 314 రన్స్ బాదిన భారత బ్యాటర్!
నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికై కూడా క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. ‘ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. నితీశ్ మెరుగైన ప్రత్యామ్నాయం కాదని నా అభిప్రాయం. రవీంద్ర జడేజా మంచి ఎంపిక. అతడు బెస్ట్ ఆల్రౌండర్. నితీశ్ను బ్యాటర్గానే ఆడించాలి. అతడు బౌలింగ్ చాలా తక్కువగా వేస్తాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ నితీశ్ను తీసుకోలేదు. వన్డే ప్రపంచకప్ 2025 ప్లానింగ్లో అతడు ఉంటాడని నేను అనుకోవడం లేదు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.