NTV Telugu Site icon

Assam Flood: అస్సాంలో వరద విధ్వంసం.. 9 జిల్లాల్లో 4 లక్షల మంది నిరాశ్రయులు

Assam Flood

Assam Flood

Assam Flood: అస్సాంలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. తొమ్మిది జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు దీని బారిన పడ్డారు. అయితే వరద నీరు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అస్సాం స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) అధికారులు తెలిపారు. పలు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం హిమంత బిస్వా శర్మ నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని షా హామీ ఇచ్చారు.

Read Also:Gold Price: నెలలో 6శాతం తగ్గిన బంగారం.. ధర మరింత తగ్గుతుందా?

ASDMA నివేదిక ప్రకారం, బక్సా, ఉదల్‌గురి, నల్‌బారి, లఖింపూర్, కమ్రూప్, గోల్‌పరా, ధుబ్రి, దర్రాంగ్, బార్‌పేట జిల్లాలకు చెందిన నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారు. ప్రజల సహాయార్థం 101 శిబిరాలు నిర్వహిస్తున్నారు. 81 వేల మందికి పైగా ఇక్కడ ఆశ్రయం పొందారు. ఐదు జిల్లాల్లో 119 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. 1,118 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయని ASDMA తెలిపింది. వరదల కారణంగా రైతుల పంటలు నాశనమయ్యాయి. 8,469.56 హెక్టార్ల భూమి పూర్తిగా నీట మునిగింది.

Read Also:Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!

కరీంగంజ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. తొమ్మిది జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయంటే వరద బీభత్సాన్ని ఊహించవచ్చు. అస్సాం సీఎంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అస్సాం ప్రజలకు అండగా నిలుస్తుందని షా అన్నారు.