అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బాల్య వివాహాలు అరికట్టేందుకు నిజుత్ మొయినా పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు రాష్ట్రంలోని బాలికలను ప్రభుత్వమే చదివించబోతుంది. దీనికోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ప్రభుత్వం ప్రతి నెలా విద్యార్థినీల ఖాతాల్లో రూ.1000 జమ చేయబోతుందన్నారు. డిగ్రీలో చేరినవారికి రూ.1,250, పీజీ (పోస్టు గ్రాడ్యుయేషన్) చేసే వారికి రూ.2,500 ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక, వేసవి సెలవుల్లో మాత్రం ప్రభుత్వం నుంచి స్టైఫండ్ రాదన్నారు. ఏడాదిలో పది నెలల పాటు విద్యార్థినీల ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది అన్నమాట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కుమార్తెలు, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినీలు మినహా అందరూ ఈ పథకానికి అర్హులే అని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
Read Also: Mega Family: పవన్ కోసం కదిలొచ్చిన మెగా కుటుంబం (Video)
అలాగే, బాల్య వివాహాలు నిర్మూలించడంతో పాటు అమ్మాయిల బంగారు భవిష్యత్ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చెప్పారు. ప్రతినెలా 11న విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేస్తామన్నారు. పీజీ కోర్సుల్లో చేరిన పెళ్లైన యువతులకు మినహాయింపు ఉంటుందన్నారు. అలాగే, ఈ పథకం వల్ల తల్లిదండ్రులపై భారం చాలా వరకు తగ్గుతుందన్నారు. తమ కుమార్తెలను కాలేజీలకు, యూనివర్సిటీలకు పంపేందుకు అవకాశం ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు.