Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్!

  • భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్
  • పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫిట్‌నెస్ సమస్యలు
  • పాక్ ప్రాక్టీస్ సెషన్‌కు అఘా దూరం
Salman Ali Agha

Salman Ali Agha

ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్‌, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అతడు మెడ నొప్పితో బాధపడుతున్నట్లు పాకిస్థాన్ మీడియా జియో న్యూస్ పేర్కొంది. బుధవారం జరిగిన పాక్ ప్రాక్టీస్ సెషన్‌కు అఘా దూరంగా ఉన్నాడు. మిగతా ప్లేయర్స్ మాత్రం సాధనను కొనసాగించారు. పాక్ జట్టుతో కలిసి దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీకి వచ్చినా.. మెడకు బ్యాండేజ్ వేసుకొని కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సల్మాన్ అఘా గాయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారి ఒకరు స్పందించారు. ‘సల్మాన్ అఘా కాస్త అసౌకర్యంగా కనిపించాడు. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. అతడికి ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. అఘా మెడ నొప్పి చిన్నదే. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే విశ్రాంతి తీసుకున్నాడు. ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. భారత్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉంటాడు. అఘా అన్ని మ్యాచ్‌లు ఆడుతాడు’ అని చెప్పారు. 31 ఏళ్ల అఘా రేపు పూర్తి స్థాయి శిక్షణను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ మెడ నొప్పి ఎక్కువగా ఉంటే ఒమన్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకుని.. భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు.

Also Read: Team India Coach: టీమిండియా హెడ్ కోచ్ కావాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన మాజీ దిగ్గజం!

లాహోర్‌కు చెందిన సల్మాన్ అఘా ఇప్పటివరకు పాకిస్తాన్ తరఫున 21 టెస్టులు, 41 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లో 27.17 సగటు, 116.43 స్ట్రైక్ రేట్‌తో 489 పరుగులు చేశాడు. బంతితో 7.50 ఎకానమీ రేట్‌తో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ గ్రూప్ Aలో ఉంది. ఇదే గ్రూపులో భారత్, ఒమన్, యూఏఈ ఉన్నాయి. పాక్ సెప్టెంబర్ 12న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఒమన్‌తో తలపడనుంది. టీ20 క్రికెట్‌లో ఇరు జట్ల మధ్య ఇది ​​మ్యాచ్.