Site icon NTV Telugu

Asia Cup 2025: ఆ ఐదుగురు ప్లేయర్లు దుబాయ్‌కు వెళ్లరు: బీసీసీఐ

Asia Cup 2025 India Squad

Asia Cup 2025 India Squad

BCCI Confirms Standby Players Will Not Travel to Dubai: యూఏఈ వేదికగా ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌, హాంకాంగ్ టీమ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆసియా కప్‌ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. అందరూ టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నారు. మెగా టోర్నీ కోసం టీమిండియా ప్లేయర్లు సెప్టెంబర్ 4న దుబాయ్‌కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5న ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్‌ సెషన్‌ ఉంటుంది.

అయితే ఆసియా కప్‌ 2025 కు ఎంపికైన స్టాండ్‌బై ప్లేయర్లు ప్రధాన జట్టుతో పాటు దుబాయ్‌కు వెళ్లరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టోర్నీలో ఎవరైనా గాయపడితే.. అతడి స్థానంలో స్టాండ్‌బై ప్లేయర్ (భర్తీ చేసే ఆటగాడు) అప్పటికప్పుడు దుబాయ్‌ చేరుకుంటారని చెప్పారు. ఆసియా కప్‌ కోసం ఎంపికైన ప్లేయర్స్ తమ ప్రాంతాల నుంచే నేరుగా దుబాయ్‌కు వెళ్తారని, యూఏఈలోనే అందరూ కలుసుకుంటారని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చారు. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపికైన విషయం తెలిసిందే.

Also Read: Nara Lokesh: కష్టపడ్డాను, గెలిచాను.. కష్టమైన విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చా!

2025 ఆసియా కప్‌ స్క్వాడ్‌లో 17 మంది ఆటగాళ్లకు అవకాశం ఉన్నా.. బీసీసీఐ మాత్రం 15 మందినే ఎంపిక చేసింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌, శుభ్‌మన్‌ గిల్ ఎంపికయ్యారు. వీరిలో ఎవరైనా గాయపడితే.. అప్పటికప్పుడు యశస్వి జైస్వాల్ దుబాయ్‌ వెళ్తాడు. ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ వెళ్తాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్ రాణాలకు గాయం అయితే.. ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కుతుంది.

Exit mobile version