Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలోకి వస్తే గోవాలో 5 రోజుల్లో E20 పెట్రోల్ను నిషేధిస్తామని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం హామీ ఇచ్చారు. ఈ హామీతో గోవాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గోవాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా E20 టౌన్హాల్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. 2027 మార్చి 10 తర్వాత గోవాలో ఆప్ సర్కార్ ఏర్పడితే ఇథనాల్ కలిపిన పెట్రోల్ నిలిపేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. అలా చేయకపోతే రాజకీయల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు.
40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో ఆప్కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 2027 మార్చిలో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు, ఫ్యూయల్ సిస్టమ్లు దెబ్బతింటున్నాయని, మైలేజీ గణనీయంగా తగ్గుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
మరోవైపు, కేంద్రం ఈ వాదనల్ని ఖండించింది. దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం, ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యమని కేంద్రం చెబుతోంది. అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత E20ని తీసుకువచ్చామని, వాహనాల్లో ఈ ఇంధనం సురక్షితమే అని చెప్పింది. ఇదే కాకుండా ఇథనాల్ బ్లెండింగ్ వల్ల చక్కెర మిల్లలకు, చెరుకు రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ లభిస్తుందని కేంద్రం చెబుతోంది.

