Arshdeep Singh: సూపర్ ఓవర్‌లో నా ప్రణాళిక అదే.. అసలు విషయం చెప్పేసిన అర్ష్‌దీప్‌!

  • సూపర్ ఓవర్‌లో భారత్ విజయం
  • అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుత బౌలింగ్‌
  • సూపర్‌ ఓవర్‌లో ప్రణాళిక ఏంటో చెప్పిన అర్ష్‌దీప్‌
Arshdeep Singh

Arshdeep Singh

ఆసియా కప్‌ 2025 సూపర్‌ 4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ టైగా మారితే.. అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేశాడు. మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. సూపర్‌ ఓవర్‌లో మాత్రం అదరగొట్టాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. పెరీరా, శనకను అవుట్ చేసి హీరో అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ సూపర్‌ ఓవర్‌లో తన ప్రణాళిక ఏంటో అర్ష్‌దీప్‌ చెప్పాడు.

‘పవర్ ప్లేలో మేం భారీగా పరుగులు ఇచ్చాం. మిగతా బౌలర్లందరూ బాగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌ వరకు తీసుకెళ్లారు. సూపర్ ఓవర్‌లో నా ప్రణాళిక స్పష్టంగా ఉంది. వైడ్ యార్కర్లు వేసి శ్రీలంక బ్యాటర్లను ఆఫ్‌సైడ్‌ ఆడించాలని చూశా. అది వర్కౌట్ అయింది. జట్టు విజయంలో నా భాగస్వామ్యం ఉన్ననందుకు సంతోషంగా ఉంది. నిత్యం మానసికంగా సిద్ధంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తా. మ్యాచ్‌లో వంద శాతం బెస్ట్‌ ఇవ్వాలని చూస్తా. అవకాశం దక్కనప్పుడు కూడా మైదానం వెలుపలా వందశాతం ఇచ్చేందుకు ప్రయత్నించాలి. శిక్షణ, ఫిట్‌నెస్‌ మీద పూర్తి దృష్టి పెట్టాలి’ అని అర్ష్‌దీప్ సింగ్‌ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

Also Read: TVK Vijay: అల్లు అర్జున్‌ మాదిరి.. హీరో విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?

ఆసియా కప్‌ 2025లో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి.. జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్‌గా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా రెండో పేసర్‌గా ఉన్నాడు. దాంతో అర్ష్‌దీప్‌కు అవకాశం రాలేదు. శ్రీలంక మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో అర్ష్‌దీప్‌కు అవకాశం దక్కింది. ఆసియా కప్‌ 2025 ఫైనల్‌ ఆదివారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్, పాకిస్థాన్‌ మధ్య జరగనుంది. ఫైనల్‌లో బుమ్రా తిరిగి రానున్న నేపథ్యంలో అర్ష్‌దీప్‌కు నిరాశ తప్పదు.