NTV Telugu Site icon

Supreme Court: క్షమాపణ మీ ప్రకటనల పరిమాణంలో ఉందా?.. రామ్‌దేవ్ బృందానికి సుప్రీంకోర్టు చురకలు

Ramdev Baba

Ramdev Baba

Supreme Court: పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు (పీటీఐ)పై విచారణ కోసం యోగా గురు రామ్‌దేవ్ సుప్రీంకోర్టుకు వచ్చారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా పతంజలి ఆయుర్వేద్, 67 వార్తాపత్రికల్లో క్షమాపణలు ప్రచురించామని, కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, తమ తప్పులు పునరావృతం కాబోవని పేర్కొంది. పతంజలి వార్తాపత్రికలలో పెట్టిన క్షమాపణ పరిమాణం దాని ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి పేజీ ప్రకటనలను పోలి ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రకటనలో, “మా న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రకటనలను ప్రచురించడం, విలేకరుల సమావేశం నిర్వహించడం తప్పు” అని పతంజలి క్షమాపణలు కోరింది. పతంజలి ప్రకటనల కోసం రూ. 10 లక్షలు ఖర్చయిందని సుప్రీంకోర్టులో పేర్కొంది. సుప్రీంకోర్టు విచారణకు ముందు వారం రోజుల తర్వాత ఎందుకు క్షమాపణలు చెప్పారని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. “క్షమాపణ మీ ప్రకటనల పరిమాణంలోనే ఉందా?” జస్టిస్ హిమా కోహ్లి అన్నారు. బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.

ఇతర ఎఫ్‌ఎంసీజీలు కూడా తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురిస్తున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇది ముఖ్యంగా చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే పిల్లలు, సీనియర్ సిటిజన్లు.. వారి ఉత్పత్తులను వినియోగిస్తున్న వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని అని జస్టిస్ హిమా కోహ్లి అన్నారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించాలని ఈ కేసులో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను అభ్యర్థించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.

గతంలో రామ్‌దేవ్ బాబా, ఎండీ బాలకృష్ణ క్షమాపణలు పరిశీలిస్తామని.. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే నేడు ఆ కేసుపై విచారణ జరిపింది. అల్లోపతిని, వైద్యులను చులకన చేసే ప్రకటనలు చేస్తోందని పతంజలిపై 2022, ఆగస్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ).. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబర్ 21న పతంజలికి వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో ఫిబ్రవరి 27న పతంజలి ప్రకటనలపై నిషేధం విధించింది.