ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఒక తీపి కబురు అందించారు. ఈ నెల 9వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్లను ఉచితంగా చూసేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక పాస్లు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం 7 జట్లు తలపడనున్న ఈ క్రికెట్ పండుగను ఈసారి విశాఖపట్నం, కడప, మంగళగిరి స్టేడియాల్లో ఫ్లడ్లైట్ల వెలుతురులో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 9 నుండి 13 వరకు విశాఖపట్నంలో.. జూన్ 17 నుండి 21 వరకు కడపలో.. జూన్ 24 నుండి 30 వరకు మంగళగిరిలో నిర్వహించనున్నారు.
జూన్ 30న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను ఆహ్వానిస్తున్నట్లు శివనాథ్ తెలిపారు. విద్యార్థులు మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా విద్యాసంస్థలకు ముందే షెడ్యూల్ సమాచారాన్ని అందిస్తామని, అలాగే విశాఖలో 10 ప్రధాన ప్రాంతాలలో ‘ఫ్లాష్ మాబ్స్’ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ మ్యాచ్లను నేరుగా చూడలేని వారి కోసం ‘జియో సినిమా’, ‘స్టార్ స్పోర్ట్స్’ నెట్వర్క్లలో ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని వెల్లడించారు.
ఈ టోర్నీలో కేవలం ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారని, వేలం ద్వారా క్రీడాకారులను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ ఇండియా-A జట్టుకు ఎంపికవ్వడం గర్వకారణమని, ఏపీఎల్ ద్వారా మరెంతో మంది ప్రతిభావంతులైన వర్ధమాన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసోసియేషన్ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ, టోర్నీని ఎక్కడా తగ్గకుండా వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపు మధ్యాహ్నం విశాఖపట్నంలో జరిగే బాడీ కౌన్సిల్ సమావేశం అనంతరం పూర్తి వివరాలను, అధికారిక షెడ్యూల్ను మీడియాకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

