ఏపీఎల్ 2026 సీజన్-5లో తుంగభద్ర వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమపై చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠభరిత పోరులో తుంగభద్ర వారియర్స్ విజయం సాధించింది. టాస్ గెలిచిన తుంగభద్ర వారియర్స్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఆరంభంలో మంచి ప్రదర్శన కనబరిచింది. తొలి 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే చివరి దశలో తుంగభద్ర బౌలర్లు అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు.
రాయలసీమ జట్టులో ధ్రువ్ కుమార్ రెడ్డి అర్థశతకంతో రాణించాడు. అతడు మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు రషీద్ 31 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలిచాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. తుంగభద్ర బౌలర్లలో సాయి చరణ్, దీపక్ స్టీఫెన్ తలో రెండు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించారు.
ఇక, 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తుంగభద్ర వారియర్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును పోటీలో నిలిపారు. సూర్య జయంత్ 25 బంతుల్లో 26 పరుగులు చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దగా, రోహిత్ కేవలం 14 బంతుల్లో 24 పరుగులు చేసి మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చాడు. చివర్లో సౌరబ్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి అద్భుత ఫినిషింగ్ ఇచ్చాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్తో కీలక సమయంలో జట్టును విజయ తీరాలకు చేర్చాడు చివరి బంతికి విజయం కోసం అవసరమైన పరుగును సాధించిన తుంగభద్ర వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. దీంతో ఏపీఎల్ 2026 సీజన్-5లో తమ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్లో కీలక సమయంలో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన సౌరబ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

